Nara Lokesh: జగన్... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్: నారా లోకేశ్

  • కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • స్వాగతం పలికిన వివిధ వర్గాలు
  • వివేకా కేసు నేపథ్యంలో లోకేశ్ వ్యాఖ్యలు
  • అబ్బాయిలిద్దరికీ చంచల్ గూడా జైలు ఖాయమని వ్యంగ్యం
Lokesh take a swipe at CM Jagan

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 74వ రోజు ఆలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అడుగడగునా మహిళలు యువనేతకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. పల్లె దొడ్డిలో లోకేష్ ని కలిసిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. దేవనకొండలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు యువనేతకు ఘన స్వాగతం పలికారు. 

నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచారని, చెత్త పన్ను కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. 

దేవనకొండలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి తమ సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. తాము వచ్చాక విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ముందుకు సాగారు. 

వలగొండ క్రాస్ వద్ద జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం హాజరయ్యారు.

దేవరకొండ చెరువు వద్ద సెల్ఫీచాలెంజ్

ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ చెరువు వద్ద లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఒకప్పుడు దేవనకొండ చెరువు ఎండిపోయి ఉండేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక హంద్రీ నీవా జలాలతో చెరువును లింక్ చేశామని వెల్లడించారు. దీని వల్ల దేవనకొండ పట్టణానికి తాగునీరు సహా పల్లెదొడ్డి, గెద్దరాళ్ల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లకు పుష్కలంగా నీరు అందుతున్నాయని తెలిపారు.. ఇది మా ప్రభుత్వం ఘనత. ఇలా సెల్ఫీ దిగే దమ్ము నీకుందా జగన్? అంటూ సవాల్ విసిరారు.

అబ్బాయిలిద్దరికీ చంచల్ గూడా జైలు ఖాయం!

ఒక బాబాయ్ ని చంపిన కేసులో ఇంకో బాబాయ్ జైలుకి వెళ్లడం ఖాయమని... అది కూడా జగన్ జైలు చంచల్ గూడకి వెళ్లడం కచ్చితంగా దేవుడి స్క్రిప్టేనని యువనేత నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ వద్ద యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడుతూ... వివేకా హత్య కేసులో జగన్ డ్రామా ట్రూప్ చిన్న లాజిక్ మిస్సైయిందని అన్నారు. వివేకా గారిని ఒప్పిస్తే అవినాశ్ ఎంపీ అవుతాడు... వివేకా గారిని చంపేస్తే నేరస్తులు అవుతారు... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ అని ఎద్దేవా చేశారు. 

"ఆరు రకాల కథలు చెప్పినా గూగుల్ టేక్ అవుట్ లో దొంగలు మొత్తం దొరికిపోయారు. చంచల్ గూడ జైలుకి జగన్ కి చాలా అనుబంధం ఉంది. త్వరలో అబ్బాయిలు కూడా చంచల్ గూడకి పోవడం ఖాయం. జగన్ డ్రామా ట్రూప్ కి వచ్చే ఐడియాలు డెకాయిట్లకు కూడా రావు. ముందు బాబాయ్ ని చంపేసారు...ఇప్పుడు ఆయన క్యారక్టర్ ని చంపేస్తున్నారు. జగన్ డ్రామా ట్రూప్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 

నా వెంట్రుక కూడా పీకలేరు అన్నాడు ఇప్పుడు సీబీఐ కొట్టిన దెబ్బకి పర్యటనలు రద్దు చేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని వెంట్రుకలు పీక్కుంటున్నాడు" అని వ్యంగ్యం ప్రదర్శించారు.

నాడు నియంత...నేడు కమెడియన్!

యువగళం... మనగళం... ప్రజాబలం అని లోకేశ్ వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రకి ముందు జగన్ కి పాదయాత్ర ప్రారంభం అయిన తరువాత జగన్ కి తేడా ఏంటో తెలుసా? అని అడిగారు. 

"యువగళం పాదయత్రకి ముందు జగన్ ఒక నియంత. నన్ను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఇంతకంటే పెద్ద నియంతలను ఫుట్ బాల్ ఆడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం తగ్గుతామా? లారీల్లో వస్తారో, రౌడీలతో వస్తారో రండి తేల్చుకుందాం అని సవాల్ చేస్తే తోకముడిచి పారిపోయారు. 

పాదయాత్ర ప్రారంభం అయిన తరువాత అన్ని వర్గాల ప్రజలు నియంతని నిలదీయడం మొదలు పెట్టారు. యువత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియంత కొమ్ములు వంచారు. పాదయాత్ర ప్రారంభం అయిన 74 రోజులకే జగన్ కమెడియన్ గా మారిపోయాడు. ఆఖరికి కుక్కలు, కోతులు కూడా ఆయన స్టిక్కర్ చూసి అసహ్యించుకుంటున్నాయి" అని పేర్కొన్నారు.

గుమ్మనూరి వల్ల ఒరిగిందేమిటి?

ఆలూరు ఎమ్మెల్యే గారి పేరు గుమ్మనూరు జయరాం గారు... మీరు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు అని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు." 2019 లో 40 వేల మెజారిటీతో గెలిపించారు. ఆయన మంత్రి కూడా అయ్యారు. కానీ ఆలూరు 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉండిపోయింది. గుమ్మనూరు జయరాం గారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. గుమ్మనూరు జయరాం గారు, ఆయన తమ్ముడు మరో ఆరు కుటుంబాలు తప్ప ఒక్క వాల్మీకి కుటుంబానికైనా న్యాయం జరిగిందా? 

ఆయన వందల ఎకరాల అధిపతి అయ్యారు. ఎకరం భూమి కొనే స్థితిలో ఇక్కడ వాల్మీకులు ఉన్నారా? ఆయన మాత్రం బెంజ్ లో తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న వాల్మీకులు కనీసం సైకిల్ కొనుక్కునే పరిస్థితిలో అయినా ఉన్నారా?

 ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కాంలో ఆయన బెంజ్ కారు గిఫ్ట్ గా తీసుకున్నారు. బెంజ్ కారులో ఆలూరు రోడ్ల మీద తిరిగే దమ్ముందా బెంజ్ మంత్రి గారూ? మీ బెంజ్ ఏమీ గాల్లో వెళ్ళదు కదా! ఆలూరులో రెండు రోజులుగా తిరుగుతున్నా అమ్మో రోడ్లు దారుణం" అని వెల్లడించారు.

ఆ డబ్బు మేం చెల్లిస్తాం... రిజిస్ట్రేషన్ చేయండి!

బెంజ్ మంత్రి గారి భార్య రేణుక గారు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్లపైన ఆస్పరి మండలంలో ఇటినా కంపెనీ నుంచి 180 ఎకరాలు కొనుగోలు చేశారని లోకేశ్ ఆరోపించారు. ఈ భూములు బినామి పేర్లతో లెక్కల్లో చూపని ఆదాయంతో కొన్నారని, ఇవి అక్రమాస్తులే అని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. 

"వాటిని తాత్కాలిక అటాచ్ చేసింది. ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా రిజిస్ట్రేషన్ కి డబ్బులు చెల్లిస్తే ఆ భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని బెంజ్ మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ధర ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ డబ్బు మేము చెల్లిస్తాం. మంత్రి గారు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చెయ్యడానికి సిద్ధమా అని సవాల్ చేస్తున్నాను. బెంజ్ మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు అంతర్రాష్ట్ర పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారు. ఆ క్లబ్ పై దాడులు చేసిన పోలీస్ అధికారులపైనే దాడులు చేశారు" అని వివరించారు.

శనగచేలో దిగి రైతుకూలీల కష్టాల విన్న లోకేష్

ఆలూరు నియోజకవర్గం దేవనకొండ శివార్లలో లోకేశ్ శనగచేలో దిగి అక్కడి రైతుకూలీల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రోజంతా కష్టపడితే రూ. 200 కూలీ వస్తోందని, పెరిగిన నిత్యావసర ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నామని కూలీలు వాపోయారు. కరెంటు బిల్లులు భారీగా పెరిగాయని, పల్లెల్లో తాగడానికి నీళ్లు కూడా ఉండడం లేదని వివరించారు. కుటుంబసభ్యులు అద్దెకు ఆటోలు నడుపుకుంటుంటే పింఛను తీసేస్తున్నారని రైతుకూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకిపారేయడమే కరెంటుబిల్లుకు పరిష్కార మార్గం అని సూచించారు "టీడీపీ హయాంలో రూ. 200 ఉన్న పింఛనును రూ.2 వేలకు పెంచాం. సంక్షేమ కార్యక్రమాలు తెచ్చేది, వాటిని కొనసాగించేది చంద్రబాబే. జగన్ ప్రభుత్వం కుంటిసాకులతో తొలగించిన పెన్షన్లు పునరుద్ధరిస్తాం. ధైర్యంగా ఉండండి... రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో అన్ని సమస్యలు తీరుతాయి" అని భరోసా ఇచ్చారు.

* యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 961.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.3 కి.మీ.*

*75వరోజు (19-4-2023) యువగళం వివరాలు:*

*ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)*

ఉదయం

7.00 – వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయత్ర ప్రారంభం.

7.30 – వలగొండలో స్థానికులతో సమావేశం.

8.25 – పుప్పులదొడ్డిలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

9.35 – కైరుప్పలతో స్థానికులతో సమావేశం.

10.45 – వెంగళదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

11.50 – కారుమంచి శివార్లలో బీసీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.50 – కారుమంచి శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – కారుమంచి శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.20 – కారుమంచిలో అస్పరి మండల ప్రజలతో సమావేశం.

6.00 – ములిగుండంలో స్థానికులతో సమావేశం.

6.55 – ములిగుండం శివారు విడిది కేంద్రంలో బస.


More Telugu News