Vishnu Vardhan Reddy: వక్ఫ్, చర్చి భూములపై ఉన్న శ్రద్ధ దేవాలయ భూములపై ఎందుకు లేదు?: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy slams AP govt on endowment lands issue
  • దేవుడి భూములంటే ఎందుకంత అలుసన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • ఆలయాల పరిస్థితిని పట్టించుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణకు స్పష్టీకరణ
  • కోర్టు చెప్పినా దేవుడి భూములను స్వాధీనం చేసుకోరా? అంటూ ఆగ్రహం
ఏపీలో దేవాలయ భూముల అంశంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేవుడి భూములంటే ఎందుకంత అలుసు? అని ప్రశ్నించారు. దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ గారూ ఈ ఆలయాల పరిస్థితిని పట్టించుకోండి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

"రాష్ట్రంలో వక్ఫ్ భూములు, చర్చి భూములపై చూపించే శ్రద్ధ దేవాలయ భూములపై మీ ప్రభుత్వం ఎందుకు చూపడంలేదు?" అని నిలదీశారు. దేవుడి ఆస్తులను కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారని, దేవుడి భూములని కోర్టు చెప్పినా స్వాధీనం చేసుకోరా? అని విష్ణు మండిపడ్డారు. 

"రాష్ట్రంలో చిన్న ఆలయాలకు నిధులు లేక ధూపదీప నైవేద్యాలు చేయడంలేదు. కొందరు పాలకమండలి సభ్యులు ఆలయ నిత్య వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. దేవుడి ఆస్తి ఒక్క గజం పరులపాలైనా బీజేపీ చూస్తూ ఊరుకోదు. ఈ భూములపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని స్పష్టం చేశారు. 

'దేవుడి భూములంటే అందరికీ చిన్నచూపే' అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై విష్ణు ఆ మేరకు స్పందించారు.
Vishnu Vardhan Reddy
Endowment Lands
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News