Srinivasa Rao: తాయత్తు కట్టుకోవడం వల్లే బతికాను: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

  • చిన్నప్పుడు తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారన్న శ్రీనివాసరావు
  • తన తాత పక్కనున్న మసీదులో తాయత్తు కట్టించాడని వెల్లడి
  • హెల్త్ డైరెక్టర్ గా ఉండి ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు
TS Health Director Srinivasa Rao sensational comments

తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. జీసస్ వల్లే కరోనా పోయిందంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలనే ఆయన మరోసారి చేశారు. తాయత్తు వల్లే తాను బతికానని... డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని అన్నారు. రాష్ట్ర వైద్య విభాగానికి హెడ్ గా ఉంటూ ఈ వ్యాఖ్యలేమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఆయన క్షుద్రపూజలు చేసినట్టు కూడా గతంలో ఆరోపణలు వినిపించాయి. 

తాజా వివాదం వివరాల్లోకి వెళ్తే... కొత్తగూడెంలో ముస్లింలకు ఆయన తన జీఎస్ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన బాల్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులెత్తేశారని... అప్పుడు తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని... ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ను శ్రీనివాసరావు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

More Telugu News