Bengaluru: వాట్సాప్ ఛాట్ చూపించలేదని లవర్ ను చంపిన ప్రియుడు

  • పుట్టిన రోజు వేడుకల్లోనే హత్యకు గురైన యువతి.. బెంగళూరులో దారుణం
  • కేక్ కట్ చేసిన కత్తితోనే ప్రియురాలి గొంతుకోసిన వైనం
  • కత్తితో సహా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన యువకుడు
Bengaluru Youth Kills Girlfriend at Birthday Party for Not Showing Her WhatsApp Chats to Him

ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శుక్రవారం ప్రియురాలి పుట్టిన రోజును ఘనంగా చేశాడు, ఆపై కేకు కోసిన కత్తితోనే ఆమె గొంతుకోశాడు. ఆపై నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వాట్సాప్ లో చాట్ చేస్తుండడం చూసి ఎవరితో చాట్ చేస్తున్నావని అడిగితే చెప్పకపోవడం, చాటింగ్ చూపించేందుకు నిరాకరించడంతో కోపం పట్టలేక చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ దారుణం.

కర్ణాటకకు చెందిన నవ్య, ప్రశాంత్ లు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరువైపులా పెద్దలు అభ్యంతరం చెప్పారు. అయినాసరే పెళ్లి చేసుకోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఉద్యోగరీత్యా ఇద్దరూ బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నవ్య బర్త్ డేను ఇద్దరూ ఘనంగా జరుపుకున్నారు. నవ్య, ప్రశాంత్ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇంతలో నవ్యకు ఓ కాల్ వచ్చింది. కాసేపు మాట్లాడి పెట్టేశాక వాట్సాప్ లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది.

ఎవరితో చాట్ చేస్తున్నావంటూ ప్రశాంత్ అడిగినా చెప్పలేదు. ముఖం కడుక్కుని వస్తానని బాత్రూంకు వెళ్లిన నవ్య.. లోపల వాట్సాప్ చాట్ చేస్తూ ఉండిపోయింది. దీంతో మండిపడ్డ ప్రశాంత్.. చాట్ వివరాలు చూపెట్టాలని నిలదీశాడు. చాటింగ్ తన వ్యక్తిగత అంశమని, చూపించబోనని తేల్చి చెప్పింది. ఇదే విషయంపై మాటామాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన ప్రశాంత్ కేక్ కోసిన కత్తితో నవ్యపై దాడి చేశాడు. మెడపై విచక్షణారహితంగా పొడవడంతో నవ్య అక్కడికక్కడే చనిపోయింది.

గంటల తరబడి మృతదేహం పక్కనే కూర్చున్న ప్రశాంత్.. తొలుత శవాన్ని మాయం చేయాలని భావించాడు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకుని నేరుగా రాజగోపాల్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన ప్రియురాలిని చంపేశానంటూ కత్తిని పోలీసులకు అప్పగించాడు. ప్రశాంత్ చెప్పింది విని హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న నవ్యను పరీక్షించి చూశారు. అయితే, అప్పటికే నవ్య చనిపోయిందని పోలీసులు తెలిపారు. డెడ్ బాడీని ఆసుపత్రికి తరలించి, ప్రశాంత్ ను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News