Telangana: అందుబాటులోకి ఓటీఆర్.. 17 నుంచి గురుకులాల్లో పోస్టుల భర్తీ దరఖాస్తు ప్రక్రియ!

  • గురుకులాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 9న నోటిఫికేషన్
  • ఓటీఆర్ పూర్తి చేస్తేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత
  • వెబ్‌సైట్‌లో వెబ్‌లింకును పొందుపరిచిన ప్రభుత్వం
OTR Now Available for TREIRB Recruitment

గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి నిన్న ఓటీఆర్ (వన్‌టైం రిజిస్ట్రేషన్) అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ నమోదు కానుండగా, అభ్యర్థులు తొలుత ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేస్తేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది.

ఓటీఆర్ నమోదుకు సంబంధించిన వెబ్‌లింకును వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఓటీఆర్ నమోదు కోసం తొలుత ఆధార్ నంబరును నమోదు చేసి ఆపై వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివిన జిల్లాను నమోదు చేయడంతో ఓటీఆర్ పూర్తవుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు లభిస్తుంది. 

ఓటీఆర్ నమోదు తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో తగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పరీక్ష ఫీజు చెల్లించి మిగతా వివరాలు నమోదు చేస్తే దరఖాస్తు చేయడం పూర్తయినట్టే. కాగా, గురుకులాల్లో మొత్తం 9,231 పోస్టుల భర్తీకి గాను గురుకుల నియామక బోర్డు ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.

More Telugu News