Navadeep: జర్నలిస్టులను ఏమీ అనలేదు .. సిరీస్ చూస్తే మీకే అర్థమవుతుంది: హీరో నవదీప్

  • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 'న్యూసెన్స్' 
  • ప్రధానమైన పాత్రను పోషించిన నవదీప్ 
  • 'ఆహా' ఫ్లాట్ ఫామ్ నుంచి రానున్న సిరీస్ 
  • అభ్యంతరాల పట్ల స్పందించిన నవదీప్
Navadeep Interview

నవదీప్ - బిందుమాధవి ప్రధానమైన పాత్రలలో 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఇంతవరకూ భారీ సినిమాలు చేస్తూ వచ్చిన పీపుల్ మీడియా వారు తొలిసారిగా 'న్యూసెన్స్' వెబ్ సిరీస్ ను నిర్మించారు. శ్రీ ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను త్వరలో 'ఆహా'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో నవదీప్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో జర్నలిస్టులకు సంబంధించిన ఒక డైలాగ్ పట్ల ఈ ఇంటర్వ్యూలో అభ్యంతరం వ్యక్తమైంది. 

అప్పుడు నవదీప్ స్పందిస్తూ .. "ఈ సినిమాలో జర్నలిస్టులను ఏమీ అనలేదు .. సిరీస్ మొత్తం చూసేటప్పుడు ఆ విషయం మీకు అర్థమవుతుంది. నేను ఈ సినిమాలో బ్యాడ్ జర్నలిస్ట్ గా కనిపిస్తాను. ఆ పాత్ర వలన కొంతమందికి నష్టం జరుగుతూ ఉంటుంది .. మరి కొంతమందికి హాని కలుగుతూ ఉంటుంది. అలా ఆ పాత్ర ఎందుకు ప్రవర్తిస్తుందనేది కథలోకి వెళితే అర్ధమవుతుంది. కావాలని చెప్పేసి అలాంటి డైలాగులు పెట్టలేదు" అన్నాడు. 

"నెగెటివ్ పాత్రలు చేయాలని ప్రతి ఆర్టిస్టుకి ఉంటుంది. అలాగే నేనూ చేశాను. ఈ సినిమా చూసిన తరువాత, చాలా బాగా చేశావని కూడా మీరే అంటారు. ఈ పాత్ర ఇలా చేయడం వలన, జర్నలిస్టులు ఫీలవుతారనే ఆలోచన నేను చేయలేదు. అలా అనుకుంటే ఏ పాత్రనూ చేయలేము. ఈ సినిమా తరువాత నన్ను మెచ్చుకునేవారూ ఉంటారు .. టార్గెట్ చేసేవారు కూడా ఉంటారు" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News