Jagan: సబ్జెక్ట్ టీచర్లకు మద్రాస్ ఐఐటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు: సీఎం జగన్

CM Jagan reviews education dept
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ ఇవాళ రాష్ట్ర విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని అధికారులకు సూచించారు. పిల్లలు పాఠశాలలకు రాకుంటే తల్లిదండ్రులకు సందేశం వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే ఏడాది విద్యా కానుకపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందించే పుస్తకాల ముద్రణ ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులపైనా సీఎం సమీక్ష చేపట్టారు. సబ్జెక్ట్ టీచర్లకు ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. మేథమాటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలు పెంచేలా ఈ కోర్సులు ఉంటాయని వివరించారు. 

ఇక, రాష్ట్రంలో ఎక్కడా టీచర్లు సరిపోవడంలేదన్న మాట రాకూడదని స్పష్టం చేశారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్ పీ) ఏర్పాటుపైనా సీఎం ఈ సమీక్షలో చర్చించారు. జూన్ నాటికి ఐఎఫ్ పీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 

పాఠశాల విద్యార్థులకు టోఫెల్ సర్టిఫికెట్ పరీక్షలపైనా సీఎం జగన్ సమీక్షించారు. బాలలకు 3 దశల్లో టోఫెల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్నద్దం చేసేలా ఇ-కంటెంట్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫ్లియేషన్ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 1000 పాఠశాలలు అఫ్లియేట్ అయ్యాయని, మిగతా స్కూళ్లను కూడా అఫ్లియేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Go Back to Shorts
Jagan
Education
YSRCP
Andhra Pradesh

More Telugu News