China: వాస్తవాన్ని మార్చలేరు..: చైనా పేర్ల మార్పు పై భారత్ స్పందన

  • అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టీకరణ
  • ఏవో కొన్ని పేర్లను ప్రకటించినంత మాత్రాన వాస్తవాలు మారవని ప్రకటన
  • చైనా నుంచి ఈ తరహా ప్రయత్నాలు మొదటిసారి కాదని వ్యాఖ్య
Wont alter reality India responds to Chinas new names for 11 spots in Arunachal

భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల పేర్లను చైనా ఎలా నిర్ణయిస్తుంది..? ఇది ఆ దేశానికే తెలియాలి. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ దక్షిణ భాగమైన జంగ్ నాన్ గా చైనా పేర్కొంటోంది. మూడో విడత ఇక్కడి 11 ప్రాంతాలకు పేర్లను ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. చైనా చర్య క్షేత్రస్థాయిలో వాస్తవాలను మార్చలేదని భారత్ పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించినట్టు మీడియాలో వచ్చిన వార్తలకు తమ స్పందన అంటూ ట్విట్టర్ లో ఓ ప్రకటనను పోస్ట్ చేసింది. విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని ఉంచారు. ‘‘ఈ తరహా నివేదికలను మేం చూశాం. ఈ తరహా ప్రయత్నాలను చైనా చేయడం ఇదే మొదటిసారి కాదు. నిర్ద్వందంగా దీన్ని ఖండిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగంగా ఉంది. అంతేకాదు ఎల్లప్పుడూ భారత్ లో అంతర్భాగంగా, విడదీయరానిదిగా ఉంటుంది. కొత్తగా కనిపెట్టిన కొన్ని పేర్లను ప్రకటించడం అన్నది వాస్తవాన్ని మార్చదు’’అని సదరు ప్రకటన స్పష్టం చేసింది. 

More Telugu News