IPL 2023: ఐపీఎల్ లో తొలి మ్యాచ్​కు ముందు ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్

  • ఈ రోజు రాత్రి బెంగళూరులో ముంబైతో తలపడనున్న ఆర్సీబీ
  • ఈ నెల 9 తర్వాత అందుబాటులోకి రానున్న వనిందు హసరంగ 
  • గాయంతో హేజిల్ వుడ్, రజత్ పాటీదార్ కూడా కొన్నాళ్లు దూరం
Bad News For Royal Challengers Bangalore

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగే తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనుంది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, శ్రీలంక ఆల్ రౌండర్ క్రికెటర్ వనిందు హసరంగ సేవలను జట్టు కొన్ని రోజుల  పాటు కోల్పోనుంది. అంతర్జాతీయ క్రికెట్ కారణంగా హసరంగ ఏప్రిల్ 9 తర్వాత మాత్రమే జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగే తమ తొలి పోరులో ముంబైతో ఆర్సీబీ తలపడనుంది. హసరంగ గత సీజన్‌లో ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 16 మ్యాచ్‌ల్లో 16.53 సగటు, 7.54 ఎకానమీ రేటుతో 26 వికెట్లు తీశాడు. ఓవరాల్ గా సెకండ్ బెస్ట్ బౌలర్ గా నిలిచాడు.

ఇక, గాయం కారణంగా ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ కూడా ఆరంభ మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లీ అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, బ్యాటర్ రజత్ పాటిదార్‌ కూడా ఈ సీజన్ సగ భాగానికి దూరం అవుతున్నాడు. పాటిదార్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడని, ఫ్రాంచైజీ అతని గాయం విషయంలో స్పష్టత కోసం వేచి ఉందని బంగార్ చెప్పాడు. ఇక కాలు గాయం నుంచి కోలుకొని ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ లో బరిలోకి దిగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చిందని వెల్లడించాడు.

More Telugu News