Balakrishna: తెలుగువాడ్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ

  • హైదరాబాదులో టీడీపీ ఆవిర్భావ సభ
  • హాజరైన నందమూరి బాలకృష్ణ
  • ఎన్టీఆర్ గురించి ప్రసంగం
Balakrishna speech in TDP Foundation Day event

టీడీపీ ఆవిర్భావ సభలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వేనోళ్ల కీర్తించారు. ఇప్పటికీ పాతతరం వాళ్ల చిత్రాలు బతికున్నాయంటే అది ఎన్టీఆర్ నటించిన చిత్రాల వల్లేనని అన్నారు. 

"ఎన్టీఆర్ తన సినిమాల్లో భక్తి రసాన్ని బతికించారు. మన సంస్కృతి సంప్రదాయాలను తన సినిమాల్లో ప్రతిబింబించారు. ఆయన పౌరాణికాల్లో నటిస్తే ప్రాణం పోసుకున్నాయి, జానపదాల్లో నటిస్తే జావళీలు పాడాయి. సాంఘిక చిత్రాలేమో సామజవరగమనాలయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట రక్తి కట్టింది. కళామతల్లి కళకళలాడింది, కనుల పండువలా నవ్వింది. ఎన్టీఆర్ నటించని పాత్ర లేదు, ఆయన చేయని సినిమా లేదు. ప్రతి పాత్రను అణువణువు నింపుకుని నటించారు. 

ప్రతి బిడ్డకు, మట్టి గడ్డకు కూడా నేను తెలుగువాడ్ని అని సగర్వంగా చెప్పుకునే ఆత్మవిశ్వాసాన్ని, దమ్ము ధైర్యం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో ఎన్టీఆర్ కు ముందు, ఎన్టీఆర్ కు తర్వాత అని చెప్పుకోవాలి. ఎన్నో పథకాలను సాహసోపేతమైన రీతిలో ప్రవేశపెట్టారు. పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే... పేదల భవితకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే... మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న ఆయనే" అని బాలయ్య వివరించారు. 

ఎన్టీఆర్ కు మరణం లేదని, నిత్యం వెలిగే మహోన్నత దీపం అని పేర్కొన్నారు. ఇళ్లు లేని వారికి పక్కా ఇళ్ల పథకం తీసుకువచ్చారని, పటేల్ పట్వారీ వ్యవస్థలు రద్దు చేసి సామాజిక సంస్కరణలు తీసుకువచ్చారని బాలకృష్ణ వివరించారు. ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిన మహనీయుడు అని, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఎన్టీఆర్ దేనని కీర్తించారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారని, గురుకుల విద్యాబోధన, సంక్షేమ హాస్టల్లు తీసుకువచ్చారని వెల్లడించారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ టీడీపీ అధినేత చంద్రబాబుపైనా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు యువతకు పెద్దపీట వేశారని తెలిపారు. జీనోమ్ వ్యాలీ, బయో టెక్నాలజీ పార్కు తీసుకువచ్చారని, నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని వివరించారు. చంద్రబాబు 28 ఫ్లైఓవర్లు నిర్మించారని, ఎంఎంటీఎస్ ద్వారా లక్షలాది మందికి ప్రయాణ సౌకర్యం కల్పించారని బాలయ్య వెల్లడించారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని తెలిపారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఘనవిజయం అందించారని, ప్రజలు తమ భవిష్యత్ కోసం ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు.

More Telugu News