Keerthy Suresh: ‘మహానటి’ విషయంలో నన్ను ట్రోల్ చేశారు: కీర్తి సురేశ్

  • మ‌హాన‌టి చిత్రంలో న‌టించ‌డానికి తొలుత నో చెప్పానన్న కీర్తి
  • సావిత్రి పాత్ర‌లో న‌టించ‌డానికి ఎంతో భ‌య‌పడ్డానని వెల్లడి
  • సోష‌ల్ మీడియాలో వ‌చ్చే నెగిటివిటీని పట్టించుకోనని వ్యాఖ్య
keerthy suresh on getting trolled for choosing mahanati

‘మహానటి’.. టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేశ్ కెరియర్ లో ఓ మైలురాయి సినిమా. కీర్తి గురించి చెప్పాల్సి వస్తే.. ‘మహానటి’కి ముందు.. తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఆ చిత్రం ఆమెకు అంత పేరు తీసుకొచ్చింది. అయితే మహానటి సినిమాను అంగీకరించినందుకు మొదట్లో తాను ట్రోల్స్ ను ఎదుర్కొన్నానని కీర్తి సురేశ్ వెల్లడించింది. ‘దసరా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మ‌హాన‌టి సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని గుర్తు చేసుకుంది.

మ‌హాన‌టి చిత్రంలో న‌టించ‌డానికి ముందు నో చెప్పానని కీర్తి తెలిపింది. అలనాటి నటి సావిత్రి పాత్ర‌లో న‌టించ‌డానికి ఎంతో భ‌య‌పడ్డానని చెప్పింది. ‘‘ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నన్ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. ‘నువ్వు కచ్చితంగా చేయ‌గ‌ల‌వు’ అని ధైర్యం చెప్పారు. ఆయ‌న న‌న్ను అంత‌గా న‌మ్మిన‌ప్పుడు.. న‌న్ను నేను ఎందుకు న‌మ్మ‌కూడ‌ద‌నుకున్నా. అలా మ‌హాన‌టి పూర్తి చేశా’’ అని వెల్లడించింది. 

సావిత్ర పాత్ర‌ను అంగీక‌రించినందుకు కొంత మంది తనను ట్రోల్ చేశారని, కానీ అది ముందు తనకు తెలియ‌ద‌ని కీర్తి చెప్పుకొచ్చింది. ‘‘సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ‘మీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల గురించి స్పందించండి’ అని మీడియా అడిగింది. అప్పుడే నాకు ట్రోల్స్ గురించి తెలిసింది’’ అని వివరించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే నెగిటివిటీపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌నని, అందుకే ట్రోల్స్ తన వ‌ర‌కు రావని చెప్పింది.

మ‌హాన‌టి సినిమా చిత్రీకరణ స‌మ‌యంలో ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నానని కీర్తి తెలిపింది. ‘‘సావిత్ర‌మ్మ‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఆమె బ‌యోపిక్ లో న‌టించ‌డం భ‌యంగా అనిపించింది. ఆమె కుమార్తెని క‌లిసి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నా. స‌వాళ్లు, విమ‌ర్శ‌లు ఎదురైన‌ప్ప‌టికీ సావిత్ర‌మ్మ పాత్ర చేసినందుకు సంతోషంగా వుంది’’ అని చెప్పుకొచ్చింది.

More Telugu News