EARTHQUAKE: భూకంపాల ముప్పు ఏ ప్రాంతాలకు ఎక్కువ? తెలంగాణ, ఏపీ పరిస్థితి ఏంటి?

  • ఉత్తర బీహార్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ కు ముప్పు అధికం
  • తెలంగాణలో గోదావరి తీర ప్రాంతాలకు ముప్పు ఎక్కువ
  • అలాగే, ఏపీలోని కోస్తా తీర ప్రాంతాలకు తీవ్రత అధికం
  • రెండు రాష్ట్రాల్లోని మిగిలిన అన్ని ప్రాంతాలు జోన్ 2లో
EARTHQUAKE PRONE REGIONS IN INDIA

భూ ప్రకంపనల వల్ల ఢిల్లీ ప్రజలు మంగళవారం రాత్రి ఎదుర్కొన్న అనుభవం ఒక విధంగా చిన్నదే. మన దేశంలో గతంలో తీవ్ర భూకంపాలు గుజరాత్, మహారాష్ట్రలో వచ్చాయి. మన దేశంలోని కొన్ని ప్రాంతాలకు భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంది. విపత్తుల తీవ్రత ఆధారంగా జోన్ 1 నుంచి జోన్ 4 వరకు వర్గీకరించారు. జోన్ 1 అంటే చాలా తక్కువ భూకంపాల ముప్పు ఉన్న ప్రాంతాలని అర్థం. కర్ణాటక పీఠభూమి ఒక్కటే జోన్ 1లో ఉంది.

జోన్ 2 అంటే మోస్తరు ముప్పు ఉన్నట్టు అర్థం. జోన్-2లో కేరళ, గోవా, లక్షద్వీప్ తోపాటు.. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు వస్తాయి.

జోన్ 3 అంటే అధిక తీవ్రత ఉన్న ప్రాంతాలు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్ సీఆర్, సిక్కింతోపాటు.. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ లోని ఉత్తరాది ప్రాంతాలు, అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్ లోని పశ్చిమ ప్రాంతాలు వస్తాయి.

జోన్ 4 అంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ముప్పు ఉన్నవి. ఉత్తర బీహార్, హిమాల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్, గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ ప్రాంతం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు జోన్ 4లో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలు..
భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్లు స్థిరంగా కదులుతూ  ఉంటాయి. ఎప్పుడైతే ఇలా రెండు ప్లేట్లు ఢీకొంటాయో.. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. అలా కాకుండా అంతర్గత టెక్టోనిక్ ప్లేట్లపై ఒత్తిడి పెరిగిపోయినప్పుడు అవి ఆ ఒత్తిడిని విడుదల చేస్తాయి. అప్పుడు చిన్నపాటి తీవ్రతతో భూకంపాలు కనిపిస్తాయి. తెలంగాణ, ఆంధప్రదేశ్ జోన్ 2లో ఉన్నాయి. అంటే మోస్తరు తీవ్రత ఉన్న ప్రాంతాలు ఇవి. తక్కువ సీస్ మిక్ రిస్క్ కలిగినవి. 

కాకపోతే ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు జోన్ 3లోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరీ వివరంగా చెప్పుకోవాలంటే.. మహారాష్ట్ర, తెలంగాణలోని గోదావరీ పరివాహక ప్రాంతాలు జోన్ 3లోకి వస్తాయి. కాకినాడ నుంచి చిత్తూరు వరకు తీర ప్రాంతాలు జోన్ 3లోకి వస్తాయి. హైదరాబాద్ సహా మిగిలినవన్నీ కూడా జోన్ 2లోనే ఉన్నాయి.

More Telugu News