Corona Virus: కోవిడ్‌ పేషెంట్లకు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు.. కేంద్రం సూచన

health ministry issues revised guidelines for covid 19 amid rise in cases
  • ఇటీవల మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
  • కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన
కరోనా మళ్లీ కలవరపెడుతోంది. కేసులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే తప్ప యాంటీబయోటిక్స్ వాడొద్దని సూచించింది. కొన్ని పరిస్థితుల్లో యాంటీబయోటిక్స్ ను నివారించడం కీల‌క‌మ‌ని పేర్కొంది.

మరోవైపు కోవిడ్‌ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్‌-రిటోనావిర్‌, హైడ్రాక్సిక్లోరోక్విన్‌, ఐవెర్‌మెక్టిన్‌, మోల్నుపిరవిర్‌, ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ ఔషధాలు వినియోగించవద్దని ఆదేశాలిచ్చింది. ప్లాస్మా థెరఫీ కూడా చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

వ్యాధి తీవ్రత మధ్యస్తంగా లేదా తీవ్రంగా ఉంటే, రోగి ఆక్సిజన్‌ సహాయంతో ఉంటే ఐదు రోజుల పాటు రెమెడిసివిర్‌ వాడొచ్చని పేర్కొంది. అయితే వ్యాధి లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల్లోపే వినియోగించాలని, ఐఎంవీ, ఎక్మో మీద ఉన్న వారికి ఇవ్వొద్దని సూచించింది. ఐసీయూలో చేర్చిన 24-48 గంటల్లో టోసిలిజుమాబ్‌ వినియోగించవచ్చని సూచించింది.
Corona Virus
health ministry revised guidelines
covid 19

More Telugu News