Prakash Raj: కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తుంటే ఎలా అనిపించిందంటే ..!: రమ్యకృష్ణ

  • ఈ నెల 22న రానున్న 'రంగమార్తాండ'
  • కీలకమైన పాత్రను పోషించిన రమ్యకృష్ణ
  • బలమైన ఎమోషన్స్ ఉంటాయని వెల్లడి 
  • కృష్ణవంశీ కెరియర్లో నిలిచిపోతుందని వ్యాఖ్య

Ramyakrishna Interview

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'రంగమార్తాండ' సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ నటించిన సినిమా ఇది. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కోసం కృష్ణవంశీ చాలా మంది హీరోయిన్స్ ను సంప్రదించాడు. కానీ బడ్జెట్ వర్కౌట్ కాకపోవడంతో, 'నేను చేస్తానులే' అని అనవలసి వచ్చింది" అంటూ నవ్వేశారు. 

"బలమైన .. లోతైన ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాను, ఈ రోజుల్లో ఎంతమంది చూస్తారనేది నాకు తెలియదు. మొదటి నుంచి ఈ విషయంలో నేను కాస్త డౌట్ గానే ఉండేదానిని. కానీ షూటింగు జరుగుతూ ఉండగా నాకు నమ్మకం పెరుగుతూ వెళ్లింది. ఇక ఆ తరువాత షూటింగుకు వెళ్లడమంటే, విందు భోజనానికి వెళ్లడం మాదిరిగా నాకు అనిపించింది" అని అన్నారు. 

"ఈ సినిమాలోని సన్నివేశాలను కృష్ణవంశీ అద్భుతంగా చిత్రీకరించాడు. డైలాగ్స్ కూడా మనసును తాకేలా ఉంటాయి. క్లైమాక్స్ సీన్ ను చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు తలచుకున్నా ఏడుపు వచ్చేస్తోంది. కృష్ణవంశీ కెరియర్లోని చెప్పుకోదగిన సినిమాలలో ఇది ఒకటిగా నిలుస్తుందని నేను ఆయనతోనే చెప్పాను .. అలాగే జరుగుతుంది కూడా " అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News