Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ల సందడి.. వివరాలు ఇవిగో!

  • ఈ నెల 31 నుంచి ఐపీఎల్ తాజా సీజన్
  • ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్ లు
  • భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన రాచకొండ సీపీ
  • టికెట్లు బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక 
Uppal stadium hosts 7 IPL matches this season

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేస్తోంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో, మునుపటిలానే దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో ఈసారి 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. 


ఏప్రిల్ 2- సన్ రైజర్స్ × రాజస్థాన్ రాయల్స్
ఏప్రిల్ 9- సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్
ఏప్రిల్ 18- సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
ఏప్రిల్ 24- సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
మే 4- సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
మే 13- సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
మే 18- సన్ రైజర్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ మ్యాచ్ ల నేపథ్యంలో, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రతినిధులు, బీసీసీఐ, హెచ్ సీఏ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు.

ఈ సందర్భం సీపీ చౌహాన్ మాట్లాడుతూ... టికెట్ల విషయంలో గందరగోళం చోటుచేసుకోకుండా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మ్యాచ్ లకు భద్రత కల్పించడంపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని, స్టేడియం చుట్టూ అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News