ps1: మణిరత్నం 'పీఎస్2' నుంచి తొలిపాట పోస్టర్ విడుదల

  • విడుదలకు సిద్ధమైన పొన్నియిన్ సెల్వన్ 2
  • ఈ నెల 20న తొలి పాట విడుదల చేస్తున్నట్టు ప్రకటన
  • ఆగనందే.. అంటూ సాగే పాటలో త్రిష, కార్తి
First single from PS2 will release on 20th march

దక్షిణాది దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వమ్ (పీఎస్ 1)తొలి భాగం అద్భుత విజయం సాధించింది. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. రెండు భాగాలు తెరకెక్కించిన మణిరత్నం కలల ప్రాజెక్టులో రెండో భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రీకరణ పూర్తవగా.. పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల కానుంది.  ఇప్పుడు చిత్ర  బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా  పీఎస్2 లోని తొలి పాటను ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

‘ఆగనందే’ అంటూ సాగే పాటలో కార్తి, త్రిష నటించారు. ఇద్దరి మధ్య ఇది ప్రేమ గీతం అని తెలుస్తోంది. పాటకు సంబంధించిన పోస్టర్ ను శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నది ఒడ్డున కళ్లకు గంతలు, చేతులు వెనక్కు కట్టేసి ఉన్న కార్తి కాళ్లపై కూర్చుని ఉండగా.. త్రిష వీరఖడ్గం చేతిలో పట్టుకుని ఆయన వైపు చూస్తున్న ఫొటో ఆకట్టుకుంటోంది.  చిత్రంలో కార్తి, త్రిష పాత్రల మధ్య ప్రేమను మణిరత్నం ఈ పాటలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి.

More Telugu News