MS Dhoni: ఓవైపు గణేశుడు.. మరోవైపు ధోని ఫొటో! పెండ్లి పత్రికపై క్రికెటర్ ఫొటో ముద్రించిన కర్ణాటక ఫ్యాన్

  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆహ్వాన పత్రిక
  • ఆదివారం (మార్చి 12న) జరగనున్న వివాహం
  • హోమ్ ఆఫ్ ధోని ఫ్యాన్ అంటూ ఇంటికి పసుపు రంగు వేసుకున్న మరో అభిమాని
Ms Dhoni Photo on fans wedding invitation card

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో ఫ్యాన్.. తన పెండ్లి పత్రికపై ధోని ఫొటోను ముద్రించాడు. వివాహ వేదిక వివరాలతో పాటు ధోని ఫొటో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 12న కర్ణాటకలో వివాహం జరుగుతున్నట్లు ఫోటోలోని వివరాల ఆధారంగా తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన శమంత్ కుమార్ పిజి (సిద్ధార్థ్) వరుడు కాగా, వధువు పేరు భవ్యశ్రీ (రమ్య). వెడ్డింగ్ కార్డ్‌లో ఒకవైపు గణేశుడి ఫోటో ముద్రించగా, మరోవైపు ధోనీ ఫోటో ముద్రించారు.

కార్డుపై మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో ఛాంపియన్స్ ట్రోఫీ 2013 నాటిదిగా తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన మిగతా వివరాలు తెలియరాలేదు. కర్ణాటక ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ ఫొటోను ట్వీట్ చేసింది. కాగా, తమిళనాడుకు చెందిన మరో అభిమాని తన ఇంటికి పసుపు రంగు వేయించాడు. ధోనిపై, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తన అభిమానాన్ని చాటుకునేలా ఇళ్లు మొత్తాన్ని పసుపు రంగుతో ముంచేశాడు. హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్ అని తన ఇంటికి పేరుపెట్టుకున్నాడు. తమిళనాడులోని అరంగుర్‌లో గోపీ కృష్ణన్, అతని కుటుంబం ఈ రకమైన ప్రేమను చూపించి వార్తల్లో నిలిచారు.


More Telugu News