YS Sharmila: ఇలాంటి ప్రబుద్ధుడ్ని జనం నమ్మరు: రేవంత్ పై షర్మిల ఫైర్

  • రేవంత్ వైఎస్సార్ పాలన తెస్తానంటున్నాడని షర్మిల వెల్లడి
  • ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేస్తున్నాడని విమర్శలు
  • ఏ ఎండకు ఆ గొడుగు పడతాడని వ్యాఖ్యలు
Sharmila fires on Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. మహానేత వైఎస్సార్ పాలన తెస్తా అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం అని విమర్శించారు.   

చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు వైఎస్సార్ ను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? అని ప్రశ్నించారు. మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగాకోరు కాదా? అని షర్మిల నిలదీశారు. 

"ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు వైఎస్సార్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పులితోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర నాయకుడు రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ, పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇటువంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లుదండాలు పెట్టినా ప్రజలు నమ్మరు. మహానేత పేరు వాడుకుంటున్న రేవంత్ కు వైఎస్సార్ అభిమానులే బుద్ధి చెబుతారు. 

వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేసింది వైఎస్సార్ బిడ్డ మాత్రమే" అని షర్మిల స్పష్టం చేశారు.

More Telugu News