Team India: 109 పరుగులకే కుప్పకూలిన భారత్​

  • ఆసీస్ స్పిన్నర్ కునెమన్ కు ఐదు వికెట్లు 
  • 3 వికెట్లు పడగొట్టిన లైయన్
  • ఉమేశ్ సిక్సర్లతో వంద దాటిన స్కోరు
Team india all out for 109

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్, లైయన్ దెబ్బకు బిత్తరపోయింది. 33.2 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయింది. 84/7తో లంచ్ కు వెళ్లిన భారత్.. విరామం నుంచి వచ్చిన ఏడున్నర ఓవర్లలోనే మరో మూడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (22), శుభ్ మన్ గిల్ (21) టాప్ స్కోరర్లు, కేఎస్ భరత్ (17), ఉమేశ్ యాదవ్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), కెప్టెన్ రోహిత్ (12) రెండంకెల స్కోరు దాటారు.

పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0), అశ్విన్ (3) నిరాశ పరిచారు. చివర్లో ఉమేశ్ రెండు సిక్సర్లు కొట్టడంతో భారత్ స్కోరు వంద దాటింది. మాథ్యూ కునెమన్ ఐదు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. లైయన్ మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీకి ఒక వికెట్ దక్కింది. కాగా, తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది.

More Telugu News