Bihar: తన భార్యతో పరారైన వ్యక్తి భార్యను పెళ్లాడిన బాధితుడు!

  • బీహార్‌లోని ఖగారియాలో ఘటన
  • ఇద్దరి భార్యల పేర్లు ఒకటే
  • తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తి భార్యతో పరిచయం పెంచుకున్న బాధితుడు
  • ఆపై వివాహం చేసుకున్న వైనం
Bihar Man marries wife of another man who eloped with his wife

బీహార్‌లోని ఖగారియాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది. తన భార్యతో పరారైన వ్యక్తి భార్యను పెళ్లాడి కసి తీర్చుకున్నాడో వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఛౌథామ్ బ్లాక్‌లోని హార్డియా గ్రామానికి చెందిన ముకేశ్.. నీరజ్ అనే వ్యక్తి భార్య రూబీతో పరారయ్యాడు. వీరిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారు. వివాహం తర్వాత కూడా వారి మధ్య పరిచయం కొనసాగింది. 

మరోవైపు, ముకేశ్‌కు కూడా వివాహం జరిగింది. ఇద్దరికీ వివాహాలు జరిగినా పరిచయం మాత్రం కొనసాగించారు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో ముకేశ్ తన ప్రియురాలు అయిన రూబీతో పరారై వివాహం చేసుకున్నాడు. అనంతరం తన ముగ్గురు పిల్లలు, రూబీతో కలిసి గ్రామాన్ని విడిచిపెట్టాడు. తన భార్య రూబీ ముకేశ్‌తో వెళ్లిపోవడంపై నీరజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామ పెద్దలు కూడా పంచాయితీ పెట్టి ముకేశ్‌తో మాట్లాడారు. అయినప్పటికీ నీరజ్ భార్యను విడిచిపెట్టేందుకు ముకేశ్ అంగీకరించలేదు.

దీంతో ముకేశ్‌పై పగ పెంచుకున్న నీరజ్.. ముకేశ్ భార్య అయిన రూబీ (ఆమె పేరు కూడా రూబీనే)తో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్థానిక ఆలయంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ముకేశ్ రోజు కూలీ కాగా, నీరజ్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.

More Telugu News