Virat Kohli: ‘ఆర్ సీబీ.. ఆర్ సీబీ’ అంటూ ఫ్యాన్స్ అరుపులు.. విరాట్ కోహ్లీ రియాక్షన్ వైరల్!

  • ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా ఆర్ సీబీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు
  • అలా అనవద్దని వారించిన కోహ్లీ
  • గుండెలపై ఇండియా పేరును చూపిస్తూ.. అరవాలని సూచన
Virat Kohli Hears RCB RCB Chants From Fans This Is What He Does Next

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ.. మైదానంలో పరుగులు తీయడమే కాదు.. కొన్ని తుంటరి పనులూ చేస్తుంటాడు. ప్రత్యర్థులను కవ్విస్తాడు. అప్పుడప్పుడూ డ్యాన్స్ లు కూడా చేస్తాడు. తాజాగా మైదానంలో కోహ్లీ వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఫ్యాన్స్ ‘ఆర్ సీబీ.. ఆర్ సీబీ’ అంటూ నినాదాలు చేశారు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వెంటనే స్పందించాడు. చెయ్యి పైకెత్తి ‘తప్పు.. అలా అనొద్దు’ అన్నట్లుగా వేలు ఊపాడు. తర్వాత తన గుండెలపై ఇండియా పేరును చూపించాడు.

దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. తర్వాత ‘ఇండియా.. ఇండియా’ అంటూ ఫ్యాన్స్ అరవగా.. ‘ఇంకా గట్టిగా’ అన్నట్లుగా తల ఆడిస్తూ చేతితో కోహ్లీ సైగ చేశాడు. దీంతో స్టేడియం మారుమోగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఐపీఎల్ లో ఎప్పటి నుంచో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సీబీ) తరఫున కోహ్లీ ఆడుతున్నాడు. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ లో తక్కువ ఇన్నింగ్స్ లోనే 25 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 25 వేల పరుగులు చేసేందుకు సచిన్ 577 ఇన్నింగ్సులు తీసుకోగా.. 549 ఇన్సింగ్స్ లలోనే కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.

More Telugu News