Ravindra Jadeja: నాగపూర్ పిచ్ ను విమర్శిస్తున్న వారికి దీటుగా బదులిచ్చిన జడేజా

  • నాగపూర్ లో భారత్, ఆసీస్ టెస్టు
  • రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
  • స్పిన్ తో కంగారూలను కకావికలం చేసిన భారత్
  • పిచ్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ల విమర్శలు
Jadeja gives fitting reply to Nagpur pitch critics

దాదాపు ఆర్నెల్ల తర్వాత గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి పునరాగమనం చేసిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నాగపూర్ టెస్టులో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. ఆసీస్ పై ఘనవిజయంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఈ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జడేజానే. 

కాగా, ఈ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో, నాగపూర్ పిచ్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై జడేజా దీటుగా స్పందించాడు. "ఆ పర్యాటకులు పిచ్ పై ఉన్న గుంతలను భారత్ కు వచ్చేటప్పుడు విమానంలోంచి చూసి ఉంటారు" అంటూ ఎద్దేవా చేశాడు. 

మ్యాచ్ కు ముందే ఇది స్పిన్ పిచ్ అంటూ ప్రచారం చేశారని జడేజా పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ పిచ్ పై స్పిన్ తక్కువేనని, ఆసీస్ బ్యాట్స్ మన్లలో ఎక్కువమంది తాము స్పిన్ లేకుండా నేరుగా విసిరిన బంతులకే అవుటయ్యారని తెలిపాడు. తాము సూటిగా బంతులు విసరడంతో ఆసీస్ బ్యాట్స్ మన్లలో అత్యధికులు ఎల్బీడబ్ల్యూ అయ్యారని జడేజా వివరించాడు. 

టీమిండియా బలం స్పిన్ అయినప్పుడు మన బౌలర్లకు అనుకూలించేలా పిచ్ లు తయారుచేయడంలో తప్పేమీలేదని స్పష్టం చేశాడు. భారత్ కు మంచి ఫాస్ట్ బౌలర్లే ఉన్నారని, అయితే వారికంటే స్పిన్నర్లే సొంతగడ్డపై ఎక్కువ మ్యాచ్ లు గెలిపించారని, అందువల్ల స్పిన్ బలంతో టెస్టు బరిలోకి ఎందుకు దిగకూడదని ప్రశ్నించాడు. 

గతంలో తాము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పచ్చికతో కూడిన గ్రీన్ టాప్ పిచ్ లను ఏర్పాటు చేశారని, కానీ తాము ఎప్పుడూ ఆ అంశంపై ఫిర్యాదు చేయలేదని జడేజా వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో పిచ్ లపై 18-20 మిల్లీమీటర్ల పరిమాణంలో గడ్డి ఉండేదని, అలాంటప్పుడు వారు కూడా భారత్ వచ్చినప్పుడు ఇక్కడి పిచ్ లపై మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికాడు.

More Telugu News