TSRTC: హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం

  • వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో ప్రమాదం
  • అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా
  • వివిధ ప్రాంతాలకు చెందిన 15 మందికి గాయాలు
TSRTC Bus Heading to Tirupati Over Turned In Vanaparthi District

హైదరాబాద్ నుంచి 37 మంది ప్రయాణికులతో తిరుపతి వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు అర్ధరాత్రి దాటాక వనపర్తి జిల్లాలో అదుపుతప్పి బోల్తాపడింది. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఈ బస్సు అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. 

ప్రమాదంలో పలు ప్రాంతాలకు చెందిన మొత్తం 15 మంది గాయపడ్డారు. కేశంపేటకు చెందిన నర్సింహ, రాయచోటికి చెందిన షకీల్, కర్నూలుకు చెందిన షబ్బీర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తకోట ఎస్సై నాగశేఖరరెడ్డి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు తరలించారు.

More Telugu News