Formula E: కాసేపట్లో ఫార్ములా-ఈ మెయిన్ రేసు... టాంక్ బండ్ వద్ద సెలెబ్రిటీల సందడి

  • హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు
  • మధ్యాహ్నం 3 గంటలకు మెయిన్ రేసు ప్రారంభం
  • బరిలో 11 జట్లు... 22 మంది రేసర్లు
  • 32 ల్యాప్స్ తో మెయిన్ రేసు
  • తక్కువ సమయంలో పూర్తి చేస్తే విన్నర్ ట్రోఫీ
All set for Formula E main race in Hyderabad

హైదరాబాదులో ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ మెయిన్ రేసు ఈ సాయంత్రం ప్రారంభం కానుంది. భారత్ లో ఎలక్ట్రిక్ కార్లతో రేసు నిర్వహించడం ఇదే ప్రథమం కాగా, అందుకు హైదరాబాద్ వేదిక కావడం విశేషంగా నిలుస్తోంది. 

చమురుతో నడిచే రేసు కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ కార్ల వేగం కొద్దిగా తక్కువే అయినా, పర్యావరణ, శబ్ద కాలుష్యాల రీత్యా ఇవి ఎంతో ఉపయుక్తమైనవి. గ్రీన్ కో కార్యాచరణను మరింత ముందుకు తీసుకెళ్లేలా నిర్వహిస్తున్న ఈ రేసును దిగ్విజయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 

ఈ నేపథ్యంలో, నగరంలోని టాంక్ బండ్ రేసింగ్ ట్రాక్ వద్ద సెలబ్రిటీల తాకిడి పెరిగింది. నిన్న నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్, నందమూరి ప్రణతి, నమ్రత శిరోద్కర్ లు ఈవెంట్ జరిగే ప్రదేశానికి విచ్చేశారు. ముంబయి నుంచి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ పక్కనే సచిన్ కూర్చుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 

నేడు మెయిన్ రేసు జరగనుండడంతో తారలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. 

కాగా, ఇవాళ్టి రేసులో సర్క్యూట్ నిడివి 2.8 కిలోమీటర్లు కాగా... 32 ల్యాప్స్ నిర్వహిస్తారు. తక్కువ సమయంలో ల్యాప్స్ పూర్తిచేసిన వారు విజేతగా నిలుస్తారు. ఫార్ములా-ఈ రేసులో భారత్ నుంచి టీసీఎస్ జాగ్వార్ టీమ్ తో పాటు మహీంద్రా రేసింగ్ టీమ్ కూడా పాల్గొంటోంది. మధ్యాహ్నం 3 గంటలకు మెయిన్ రేసు ప్రారంభం కానుంది. 11 జట్ల నుంచి 22 మంది రేసర్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు.

More Telugu News