China: భారత్ పైనా చైనా బెలూన్ల నిఘా!

  • చైనాలోని హైన‌న్ ప్రావిన్సు నుంచి బెలూన్లు ఆప‌రేట్ అవుతున్నాయన్న వాషింగ్టన్ పోస్ట్
  • అనేక దేశాల సైనిక స‌మాచారాన్ని సేకరించినట్లు వెల్లడి
  • జ‌పాన్‌, ఇండియా తదితర వ్యూహాత్మ‌క ప్రాంతాల‌ను టార్గెట్ చేసినట్లు కథనం
chinese spy balloons targeted india several other countries report

చైనా నిఘా బెలూన్ల గురించిన విషయాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఇటీవల అమెరికా గగనతలంలో ఓ బెలూన్ కనిపించడం, అమెరికా దాన్ని పేల్చివేయడం తెలిసిందే. ఇలా ఒక్క అమెరికాలో మాత్రమే కాదు.. చాలా దేశాలపై బెలూన్లతో చైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

తన పొరుగున ఉన్న ఇండియా, జపాన్ సహా పలు దేశాలను నిఘా బెలూన్లతో చైనా టార్గెట్ చేసినట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది. ‘‘నిఘా బెలూన్లు పలు సంవ‌త్స‌రాలుగా చైనాలోని హైన‌న్ ప్రావిన్సు నుంచి ఆప‌రేట్ అవుతున్నాయి. అనేక దేశాల సైనిక స‌మాచారాన్ని ఆ బెలూన్లు సేక‌రించాయి. జ‌పాన్‌, ఇండియా, వియ‌త్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌లో ఉన్న వ్యూహాత్మ‌క ప్రాంతాల‌ను బెలూన్లు టార్గెట్ చేశాయి’’ అని 'ద వాషింగ్ట‌న్ పోస్టు' త‌న క‌థ‌నంలో పేర్కొంది. 

ర‌క్ష‌ణ‌, ఇంటెలిజెన్స్ అధికారుల‌తో నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూల ఆధారంగా రిపోర్టు తయారు చేసినట్టు సదరు మీడియా వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీలోని వైమానిక ద‌ళం ఆ నిఘా బెలూన్ల‌ను ఆప‌రేట్ చేస్తోంద‌ని, ఇవి 5 ఖండాల‌పై క‌నిపించిన‌ట్లు వెల్లడించింది. 

మరోవైపు ఇండియా సహా త‌మ మిత్ర దేశాల‌కు అమెరికా కొన్ని ర‌హ‌స్య అంశాల‌ను తెలియజేసింది. గత సోమవారం (అమెరికా టైం ప్రకారం) వాషింగ్ట‌న్‌లో జరిగిన మీటింగ్‌లో ఇండియాతో పాటు సుమారు 40 దేశాల‌కు చెందిన ఎంబ‌సీ అధికారులు పాల్గొన్నారు. వారికి నిఘా బెలూన్ల గురించిన విష‌యాల‌ను డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షేర్‌మాన్ వెల్ల‌డించారు.

More Telugu News