turkey: టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లు కంపించిన భూమి

  • చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతాయని ప్రకటించిన అమెరికా జియోలాజికల్ సర్వే
  • 5.0 నుంచి 6.0 తీవ్రతతో రావచ్చని వెల్లడి
  • బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం
there have been 100 aftershocks so far in turkey

వరుస ప్రకంపనలతో టర్కీ (తుర్కియే) వణికిపోతోంది. నిన్న 7.8 తీవ్రతతో అతి భారీ భూకంపం సంభవించడంతో 4,400 మందికిపైగా చనిపోయారు. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మరోవైపు ప్రకంపనలు ఆగడం లేదు.

నిన్నటి ప్రధాన భూకంపం తర్వాతి నుంచి ఇప్పటి దాకా 100 కంటే ఎక్కువ సార్లు భూమి కంపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న చిన్న ప్రకంపనలు కొనసాగుతున్నాయని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం సైంటిస్టులు చెబుతున్నారు. 5.0 నుంచి 6.0 తీవ్రతతో కొంతకాలం ప్రకంపనలు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఈ రోజు రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ప్రధాన భూకంపం సమయంలో కూలని భవనాలు కూడా ఈ ప్రకంపనలతో కూలిపోతున్నాయి. అప్పటికే బీటలువారి.. తీవ్రంగా దెబ్బతినడంతో ప్రకంపనల ధాటికి నిట్టనిలువునా కుప్పకూలుతున్నాయి.

టర్కీ, సిరియాలో వరుస ప్రకంపనలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నిన్న రాత్రంతా చలిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఇప్పటివరకు 4,400 మందికిపైగా టర్కీ, సిరియాలో మరణించగా.. శిథిలాల కింద వేల మంది చిక్కుకున్నారని తెలుస్తోంది.

More Telugu News