TTD: శ్రీవారి ఆర్జిత సేవలకు రేపటి నుంచే బుకింగ్

  • లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయించనున్న టీటీడీ
  • ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి సేవలకు టికెట్లు
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Online booking for arjita sevas at Tirumala from February 8

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ నెల 8 నుంచి ఈ టికెట్లకు రిజిస్ట్రేషన్ ను ప్రారంభిస్తామని తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభించి శుక్రవారం (10వ తేదీ) ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తామని వివరించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఈ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ఈ నెల 22 నుంచి 28 తేదీ వరకు ఆయా సేవల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని వివరించింది.

స్వామి వారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను ఈ నెల 9 న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ (https://ttdsevaonline.com) ద్వారా ఈ సేవలకు సంబంధించిన దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది. కాగా, మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 8 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News