air india: గాల్లో విమానం.. ఇంజిన్ లో మంటలు

  • అబు దాబీ ఎయిర్ పోర్టు నుంచి కాలికట్ కు టేకాఫ్ తీసుకున్న ఎయిరిండియా విమానం
  • ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు గుర్తించిన సిబ్బంది
  • అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం
  • తప్పిన పెను ప్రమాదం.. ప్రయాణికులంతా క్షేమం
air india express flight engine catches fire all passengers safe

ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ఎయిరిండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు అబు దాబీ ఎయిర్ పోర్టులో జరిగిందీ ఘటన. ‘‘అబుదాబీ నుంచి కాలికట్ కు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ బీ737-800 ఎయిర్ క్రాఫ్ట్ బయల్దేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న తర్వాత సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా.. మొదటి ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో అబు దాబీ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. 

ఘటన జరిగిన సమయంలో 184 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.

ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం వారంలో ఇది రెండోసారి, నెల వ్యవధిలో మూడోసారి. జనవరి 29న షార్జా నుంచి వస్తున్న విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. జనవరి 23న తిరువనంతపురం నుంచి మస్కట్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం.. కంప్యూటర్ సిస్టమ్ లో సాంకేతిక లోపాలతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి వచ్చింది.

ఇక గతేడాది డిసెంబర్ లో దుబాయ్ కి వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో పాము కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్ కి బోయింగ్ బీ-737 విమానం వెళ్లింది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత.. విమానంలో పాము కనిపించింది.

More Telugu News