infant dead body: బాత్రూమ్ నాలాలో శిశువు మృతదేహం.. నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో దారుణం

  • బాలింతల కోసం ఏర్పాటు చేసిన బాత్రూమ్ లో నాలా జామ్..
  • నాలా మూత తెరిచి చూడగా పసికందు మృతదేహం కనిపించిందన్న సిబ్బంది
  • ఆసుపత్రిలో విచారణ జరుపుతున్న అధికారులు, పోలీసులు
Infant body was found in the bathroom of Nagar Kurnool General Hospital

నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్ లోని నీళ్లు బయటకు వెళ్లడంలేదని నాలా తెరిచిన సిబ్బందికి అందులో రోజుల పసిగుడ్డు మృతదేహం కనిపించింది. దీంతో అవాక్కయిన సిబ్బంది.. ఆసుపత్రి అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. పసికందు మృతదేహం నాలాలో పడవేసింది ఎవరనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డెలివరీ వార్డులో ఈ దారుణం జరిగింది. ఆసుపత్రిలోని రికార్డుల ప్రకారం.. సోమవారం డెలివరీ కోసం 18 మంది గర్భిణీలు ప్రసూతి వార్డులో చేరారు. అందులో 8 మంది గర్భిణీలకు సిజేరియన్ చేశారు. ముగ్గురికి నార్మల్ డెలివరీ అయింది. మిగతా వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వార్డుతో పాటు గర్భిణీల సమస్యల కోసం ఏర్పాటు చేసిన జనరల్ ఓపీ వార్డుకు పలువురు గర్భిణీలు వచ్చి వెళ్లారు. బాలింతల కోసం ఏర్పాటు చేసిన బాత్రూమ్ లో నాలా మూత తెరిచి, అందులో పసికందు మృతదేహాన్ని పడేసి మూతను తిరిగి గట్టిగా బిగించారు.

ఈ నేపథ్యంలో బాత్రూమ్ లో గుర్తించిన పనికందు ఎవరి బిడ్డ అనేది తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓపీకి వచ్చిన వారిలో ఎవరైనా బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చి, ఆపై నాలాలో పడేసి వెళ్లారా.. లేక పుట్టిన శిశువును వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నమా? అనేదానిపై ఆరా తీస్తున్నారు. కాగా, బాత్రూమ్ లో పసికందు మృతదేహం బయటపడడంతో ఆసుపత్రిలోని బాలింతలు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News