బాలకృష్ణ ఆ మాటలు ఎలా అన్నారో అర్థం కావడంలేదు: రోజా

Roja slams Balakrishna for his remarks
  • రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయన్న బాలకృష్ణ
  • జీవోను బాలకృష్ణ పూర్తిగా చదవాలన్న రోజా
  • బావ కళ్లలో ఆనందం కోసం అలా మాట్లాడి ఉంటాడని విమర్శలు
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిన్న చంద్రగిరిలో చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఏపీలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను మంత్రి రోజా తప్పుబట్టారు. 

జగన్ పాలన సజావుగా సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని బాలకృష్ణ అనడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. బాలకృష్ణ స్క్రిప్టు చూసి ఆ వ్యాఖ్యలు చేశారా లేక తెలియక మాట్లాడారో అర్థం కావడంలేదని అన్నారు. జీవో నెం.1ను పూర్తిగా చదివితే బాలకృష్ణ తన వ్యాఖ్యలను తప్పకుండా వెనక్కి తీసుకుంటారని అన్నారు. 

ఎమర్జెన్సీ అంటూ మాట్లాడడం సిగ్గుచేటని, సినిమాల్లో డైలాగులు చెబితే చప్పట్లు కొడతారేమో కానీ, ప్రజల సమస్యలు తీరతాయా? అని ప్రశ్నించారు. ఇటీవల 11 మంది చనిపోయినప్పుడు బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నించారు. 

ఏదేమైనా, తన అల్లుడు, కూతురు బాగుండాలని, బావ కళ్లలో ఆనందం చూడాలని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినట్టుందని ఆమె విమర్శించారు. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో ఎన్టీరామారావుపై జరిగిన చర్చ కూడా స్క్రిప్టు ప్రకారమే జరిగిందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
Advertisement
Roja
Balakrishna
Jagan
Chandrababu
YSRCP
TDP

More Telugu News