కుప్పంలో ముగిసిన చంద్రబాబు మూడ్రోజుల పర్యటన... సంగనపల్లిలో వాడీవేడిగా ప్రసంగం

Chandrababu Kuppam tour concludes
  • సొంత నియోజకవర్గంలో చంద్రబాబు వాడీవేడి పర్యటన
  • సీఎం జగన్ పైనా, పోలీసులపైనా నిప్పులు చెరిగిన చంద్రబాబు
  • వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టీకరణ
  • ఈ సాయంత్రం పర్యటన ముగించుకుని బెంగళూరు పయనం
సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ముగిసింది. చంద్రబాబు పర్యటన మూడ్రోజుల పాటు సాగింది. ఈ నెల 4న ఆయన కుప్పం నియోజకవర్గానికి వచ్చారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనగా, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు ఎదురయ్యాయి. టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి కూడా జరిగింది. తన ప్రచార రథాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారంటూ పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. 

సంగనపల్లిలో ఓ దశలో ఎక్కడి నుంచి మాట్లాడాలంటూ తన వాహనంపైకి ఎక్కి ప్రసంగించారు. ఉన్మాది సీఎం చెప్పాడని తనను పోలీసులు కుప్పంలో అడ్డుకున్నారని మండిపడ్డారు. 

"నాకు వాహనం ఇవ్వకపోతే బస్సు పైకెక్కి మాట్లాడాల్సి వస్తోంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మాట్లాడుతున్నా. రాజ్యాంగం రాసింది సైకో జగన్ రెడ్డి కాదు... అంబేద్కర్ అని తెలుసుకోవాలి. జగన్ ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదు. 

జగన్ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి పోయింది. రాష్ట్రంలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న నాకు గౌరవం ఇవ్వని ఈ సీఎం జగన్ రెడ్డి మాటలు వింటే పోలీసులూ జైలుకు పోతారు. ఇంత ఫెయిల్ అయిన సీఎంను ఎప్పుడూ చూడలేదు... ఏమి చేశారని ఈ సీఎంకు జనం ఓట్లు వెయ్యాలి..?

అన్ని ధరలు పెరిగాయి... ప్రజల బతుకు భారం అయ్యింది. సంగనపల్లికి కూడా పొరుగు రాష్ట్రం మందు వస్తోంది. ఈ వ్యాపారం చేసేది కూడా వైసీపీ నేతలే. రాష్ట్రంలో పిల్లలు గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. విశాఖను డ్రగ్స్ రాజధాని చేశారు. అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని కార్యక్రమం పెట్టాను. 

నాడు పాడి పరిశ్రమకు మద్దతు ఇచ్చాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా పాడి పంట ఉంది. వైసీపీ వచ్చాక కుప్పంలో ఒక్క పనైనా చేశారా? ఈ ఊళ్ళో ఒక్క పనైనా జరిగిందా? ఈ ప్రాంతంలో మళ్ళప్ప కొండను ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగమూ రాలేదు. మన ప్రాంతంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అందుకే సైకో పోవాలి... సైకిల్ రావాలి. 

చరిత్రలో ఫెయిల్డ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. పోలీసుల మెడల మీద కత్తి పెట్టి వాళ్ళతో అక్రమాలు చేయిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం మీద అసహ్యం పుట్టించే జగన్ బొమ్మ ఎందుకు? ప్రజల ఆస్తుల మీద దరిద్రుడి బొమ్మలు ఎందుకు? 

ఉద్యోగులు జీతం వస్తే చాలు అనే స్థితికి వచ్చారు. వాళ్ళ హక్కులన్నీ పోయాయి. కుప్పం కోసం హంద్రీనీవా నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేశాను. ఆ పనులు కూడా ఈ ముఖ్యమంత్రి ఆపేశారు. కుప్పంలో నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటే అనుమతి కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? గ్రానైట్ వ్యాపారుల నుంచి 50 కోట్లు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ఫైన్ కట్టాలి అంటున్నారు. ఎవరూ కమిషన్ ఇవ్వాల్సిన పనిలేదు. అవసరం అయితే వ్యాపారులు కోర్టుకు వెళ్ళండి. నేను మీకు అండగా ఉంటాను" అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో ప్రసంగించారు. 

మొత్తమ్మీద టీడీపీ అధినేత కుప్పం నియోజకవర్గ పర్యటన వాడీవేడిగా సాగింది. వైసీపీ ప్రభుత్వం, పోలీసులే లక్ష్యంగా చంద్రబాబు ప్రసంగాలు సాగాయి. ఈసారి వైసీపీ గెలవడం అనేది కల్ల అని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే లెక్కలు సరిచేస్తామన్న కోణంలో ఘాటు హెచ్చరికలు చేశారు. కాగా, ఈ సాయంత్రం పర్యటన ముగించుకున్న చంద్రబాబు గుడుపల్లి మండలం సంగనపల్లి నుంచి బెంగళూరు పయనమయ్యారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళతారు. 


Go Back to Shorts
Chandrababu
Kuppam
TDP
Chittoor District
Andhra Pradesh

More Telugu News