Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఆగంతుకులు.. ప్రారంభించిన నాలుగు రోజులకే ఘటన

  • డిసెంబరు 30న రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
  • హౌరా-న్యూ జల్పాయిగురి మధ్య నడుస్తున్న రైలు
  • ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఘటన
  • దాడిలో పగిలిన కిటికీ అద్దాలు
Stones pelted at Howrah bound Vande Bharat Express train

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. మాల్దాలోని కుమార్‌గంజ్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబరు 30న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఈ రైలును ప్రారంభించారు. ఇది దేశంలోని ఏడో వందేభారత్ రైలు. హౌరా-న్యూ జల్పాయిగురి స్టేషన్ల మధ్య ఇది నడుస్తోంది. రైలును ప్రారంభించి నాలుగు రోజులు కూడా కాకముందే దుండగులు ఈ రైలుపై రాళ్లతో దాడిచేశారు. ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 

రైలు కుమార్‌గంజ్ స్టేషన్‌ను దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. దుండగులు బయటి నుంచి రాళ్లు విసిరారని, అద్దాలు పగిలాయని రితు ఘోష్ అనే ప్రయాణికుడు తెలిపాడు. రైలు మాల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నాడు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, ఈ ఘటనతో తాము షాకయ్యామని వివరించాడు. ఈ రాళ్ల దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారన్న విషయంలో స్పష్టత లేదు. రాళ్లదాడి ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

More Telugu News