Suryanagari Express: పట్టాలు తప్పిన సూర్యనగరి ఎక్స్‌ప్రెస్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

  • బాంద్రా టెర్మినస్ నుంచి జోధ్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం
  • పట్టాలు తప్పిన 8 కోచ్ లు.. 10 మందికి గాయాలు
  • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
10 injured as several coaches of Suryanagari Express derail in Rajasthan

రాజస్థాన్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాంద్రా టెర్మినస్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ జోధ్‌పూర్ డివిజన్‌లోని రాజ్‌కియావస్-బొమద్ర మధ్య పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 8 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

సమాచారం అందుకున్న వెంటనే నార్త్ వెస్టర్న్ రైల్వే అధికారులు కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలానికి బయలుదేరారు. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేశారు. 

రైలు మార్వార్ జంక్షన్ నుంచి బయలుదేరిన ఐదు నిమిషాల్లోపే రైలులో కుదుపు లాంటి శబ్దం వచ్చిందని, ఆ తర్వాత రెండుమూడు నిమిషాలకే రైలు ఆగిపోయిందని ఓ ప్రయాణికుడు తెలిపాడు. కిందికి దిగి చూస్తే చివరి ఎనిమిది బోగీలు పట్టాలు తప్పి కనిపించాయని వివరించాడు. ఆ తర్వాత 15-20 నిమిషాలకే అక్కడికి అంబులెన్సులు వచ్చినట్టు తెలిపాడు.

More Telugu News