టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. కొడుకుని చూసి స్పృహ తప్పి పడిపోయిన ధర్మారెడ్డి

TTD EO Dharma Reddy son suffers from heart attack
  • చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స
  • వచ్చే నెల శేఖర్ రెడ్డి కుమార్తెతో ధర్మారెడ్డి కుమారుడి వివాహం
  • ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళి (శివ) వయసు 28 సంవత్సరాలు. ఇటీవలే ఆయనకు చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. వచ్చే నెల వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు శుభలేఖలను పంచుతున్నారు. 

చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి నిన్న మధ్యాహ్నం ఆయన కారులో వెళ్లారు. కాసేపటి తర్వాత గుండెలో నొప్పిగా ఉందని కారులోనే ఉన్న స్నేహితుడితో ఆయన చెప్పారు. దీంతో, ఆయనను నేరుగా కావేరి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే శేఖర్ రెడ్డి హాస్పిటల్ కు చేరున్నారు. ధర్మారెడ్డి దంపతులు నిన్న సాయంత్రం ఆసుపత్రికి వెళ్లారు. చంద్రమౌళి ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతోపాటు సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు, ధర్మారెడ్డితో పాటు ఆసుపత్రికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు కూడా వెళ్లారు. కొడుకును చూడగానే ధర్మారెడ్డి కళ్లుతిరిగి స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించడంతో కోలుకున్నారు.

Go Back to Shorts
Dharma Reddy
TTD EO
Son
Heart Attack

More Telugu News