Uttar Pradesh: తనను చంపేస్తే బతికొచ్చి బాధలు తీరుస్తానన్నాడని.. అలాగే చేసి జైలుపాలైన స్నేహితుడు!

  • ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఘటన
  • తనకున్న తాంత్రిక శక్తులతో చనిపోయాక బతికొచ్చి అద్భుతాలు చేస్తానని హామీ
  • నిజమేనని నమ్మి చంపేసిన స్నేహితుడు
man killed his friend after he assured to reborn in UP prayagraj

పేద కుటుంబం కావడంతో ఆర్థిక కష్టాలు తరుచూ అతడిని వేధించేవి. అవి తీరే మార్గం లేక నిత్యం వేదనకు గురయ్యేవాడు. అంధకారంగా మారిన భవిష్యత్తును తలచుకుని విచారించేవాడు. కట్ చేస్తే స్నేహితుడిని చంపిన కేసులో ఇప్పుడతడు జైలులో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నితీశ్ సైనీది నిరుపేద కుటుంబం. వెంటాడుతున్న ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనిపించక తీవ్రంగా మథనపడేవాడు. 

ఈ క్రమంలో ఆరు నెలల క్రితం హరిద్వార్‌లోని హర్ కీ పౌఢీ వెళ్లిన నితిన్‌కు అక్కడ ఆశిష్ దీక్షిత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. నితిన్ తన కష్టాలను ఆయనకు చెప్పి బాధపడ్డాడు. అతడి కష్టాలు విన్న ఆశిష్.. తనకు తాంత్రిక శక్తులు ఉన్నాయని, వాటితో కష్టాలను మటుమాయం చేస్తానని నితిన్‌కు హామీ ఇచ్చాడు. ఈ నెల 8న ఇద్దరూ కలిసి ప్రయాగ్‌రాజ్ వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నారు. 

అనంతరం తనను చంపేయాలని ఆశిష్ కోరాడు. తనను చంపేస్తే తిరిగొచ్చి తనకున్న తాంత్రికశక్తులతో అద్భుతాలు చేస్తానని, కష్టాలన్నీ తీర్చేస్తానని నితిన్‌కు చెప్పాడు. అతడి మాటలు విని నిజమేనని భావించిన నితిన్ కత్తితో మెడపై వేటు వేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్‌పై హత్యకేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

More Telugu News