Ashok Babu: ఉద్యోగులపై కక్షతోనే 13వ తేదీ వచ్చినా జగన్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

  • జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందన్న అశోక్
  • శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
  • ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచన
  • 1950ల నాటి పరిస్థితులు మళ్లీ వచ్చాయని విమర్శలు
TDP MLC Ashok Babu questions YCP Govt why they hold salaries

ఉద్యోగులపై కక్షతోనే జగన్ రెడ్డి సకాలంలో జీతాలివ్వడంలేదని, రాష్ట్ర ఆదాయం బాగుందంటున్న ప్రభుత్వం, 13వ తేదీ వచ్చినా ఉద్యోగులకు ఎందుకు జీతాలివ్వలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగులకు ఠంచనుగా ఒకటో తేదీనే జీతాలిచ్చామని చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వముందని విమర్శించారు. 

ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిపై ప్రభుత్వం తక్షణమే వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉద్యోగ సంఘం నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 

"జీతాల కోసం ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసే దుస్థితిని పాలకులు కల్పించారు. ఎప్పుడో 1950ల నాటి ఇబ్బందికర పరిస్థితుల్ని, మరలా ఇప్పుడు ఉద్యోగులు అనుభవిస్తున్నారు. ఇటీవల ఒక మంత్రి ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లుపట్టుకోవాలంటున్నాడు. అంతటి దుస్థితి వారికి ఎప్పటికీ రాదని తెలుసుకోండి. ఉద్యోగులు ప్రజలు ఎన్నుకుంటే ఉద్యోగాల్లోకి రావడంలేదని మంత్రి గ్రహించాలి. ఏం తప్పుచేశారని ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లుపట్టుకోవాలి? 13వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వమే కాళ్లు పట్టుకోవాలి. 

పెన్షన్లు, జీతాల రూపంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఏటా రూ.60 వేలకోట్లు ఇస్తుంది. దానిలో తిరిగి మరలా రూ.55 వేలకోట్లు మార్కెట్లోకే వస్తుంది. ఈఎమ్ఐలు, ఇతరత్రా చెల్లింపులు, అవసరాల కోసం ఆ సొమ్మంతా ఉద్యోగులు చాలావరకు ఖర్చుపెడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.2,200కోట్లు ఇవ్వాల్సి ఉందని జనవరి 2022లో జగన్ ప్రభుత్వమే చెప్పింది. కానీ, జీపీఎఫ్ కి అప్లై చేస్తే ఎప్పుడొస్తుందో తెలియని స్థితి. మెడికల్ రీయింబర్స్ మెంట్ ఫీజులు ఎప్పుడొస్తాయో అర్థంకావడంలేదు. ఆఖరికి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వముంది. 

రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు డీఏ బకాయిలు సహా అన్నీకలిపి జగన్ సర్కారు రూ.27,150 కోట్లు హోల్డ్ లో పెట్టింది. ఈ వాస్తవాలు ఉద్యోగులు అందరికీ కూడా తెలియవు. రాష్ట్రానికి జీఎస్టీ ఆదాయం పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం బాగానే వస్తోంది. కానీ జీతాలు ఎందుకు ఆపారు?" అంటూ అశోక్ బాబు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

More Telugu News