Bride: గంటల్లో పెళ్లి.. గదిలో ఆత్మహత్య చేసుకున్న వధువు

  • నిజామాబాద్ లో పెళ్లింట విషాదం
  • వరుడి వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ
  • వరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Bride commits suicide hours before marriage

పెళ్లి మండపంలో విషాదం చోటు చేసుకుంది. కొన్ని గంటల్లో వరుడితో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లి కూతురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్‌ జిల్లా నవిపేటలో ర్యాగల రవళి (26), సంతోష్  పెళ్లి ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఓ ఫంక్షన్ హాల్ లో జరగాల్సి ఉంది. శనివారం రాత్రి జరిగిన మెహెందీ ఫంక్షన్లో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రవళి నృత్యం కూడా చేసింది. ఉదయం అంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా.. రవళి ఇంట్లో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపులు బద్దలు కొట్టారు. 

గదిలో సీలింగ్ ఫ్యాన్స్ కు ఉరివేసుకున్న రవళి విగత జీవిగా కనిపించింది. కన్యాదానం చేసి అత్తారింటికి పంపాల్సిన తమ కూతురిని కాటికి సాగనంపాల్సిన పరిస్థితి రావటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కొడుకు వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రవళి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని చెప్పడంతో పాటు పలు విషయాల్లో మానసికంగా వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు. వాళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు వరుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News