Kidnap: రంగారెడ్డి జిల్లాలో 100 మందితో వచ్చి సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్

  • డెంటల్ డాక్టర్ వైశాలిని ఎత్తుకెళ్లిన యువకుడు
  • తనతో వివాహానికి ఒప్పుకోలేదన్న కోపంతో దాడి
  • ఇంట్లో ఫర్నిచర్, వాహనాలు ధ్వంసం
  • అడ్డొచ్చిన వారిపై దాడి
100 men kidnap a woman in Rangareddy district

రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. దాదాపు 100 మందితో వచ్చి సినీ ఫక్కీలో యువతిని ఎత్తుకెళ్లారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..  

ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె ముచ్చర్ల వైశాలి. 24 ఏళ్ల వైశాలి డెంటల్ డాక్టర్. వీరు తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ సిరి టౌన్ షిప్ లో నివసిస్తున్నారు. అయితే, నవీన్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద ఎత్తున యువకులను వెంటేసుకుని వచ్చి వైశాలిని కిడ్నాప్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇంట్లోని ఫర్నిచర్ ను, వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చినవారిపై దాడికి పాల్పడ్డారు. 

నవీన్ రెడ్డి ఓ టీ షాప్ చైన్ ఓనర్ అని తెలుస్తోంది. గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. వైశాలిని పెళ్లి చేసుకుంటానని నవీన్ రెడ్డి చెప్పగా, ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే, వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్నారు. 

కాగా, వైశాలికి ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మరికొన్నిరోజుల్లో పెళ్లి జరగనుండగా, ఈ కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. వైశాలిని కాపాడాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు సాగర్ రోడ్డుకు ఇరువైపులా బైఠాయించి నినాదాలు చేస్తున్నారు.

More Telugu News