అప్పుడే రంగంలోకి కాంగ్రెస్.. ‘ఆపరేషన్ లోటస్’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడే ఎత్తుగడ!
- హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్కు ఎమ్మెల్యేలను తరలించనున్న కాంగ్రెస్
- చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, భూపిందర్ సింగ్ హుడాలకు బాధ్యతలు
- నేడు సిమ్లా చేరుకోనున్న ప్రియాంక గాంధీ
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగతంగా దీనిని పర్యవేక్షిస్తున్నారని, ఈ రోజు ఆమె సిమ్లా చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వెల్లడవుతున్న ఫలితాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అధికార బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్తంత ముందంజలో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 33, బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది.
1985 తర్వాత రాష్ట్రంలో రెండోసారి వరుసగా ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్న కాంగ్రెస్ తమకు అధికారం ఖాయమని భావిస్తోంది. మరోవైపు, తాము గెలవడం ద్వారా చరిత్రను తిరగరాయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఒకవేళ ఇప్పుడున్న సంప్రదాయమే కొనసాగితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా.