Uttarakhand: అంకితా భండారీ హత్య కేసు నిందితులకు నార్కో టెస్టులు!

  • ఇప్పటికే కోర్టు అనుమతి కోరిన దర్యాప్తు అధికారులు
  • ఉత్తరాఖండ్ రిసార్టులో రిసెప్షనిస్టుగా పని చేసిన అంకితను హత్య చేసిన రిసార్టు యజమాని పులకిత్, అతని స్నేహితులు
  • నార్కో పరీక్షల తర్వాతనే చార్జిషీటు దాఖలు చేయనున్న పోలీసులు
All accused in Ankita Bhandari murder case to undergo narco test says Sources

ఉత్తరాఖండ్ లో రిసార్టు రిసెప్షనిస్టు అంకితా భండారీ హత్య కేసు ఆ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన నిందితుడు, రిసార్టు యజమాని పులకిత్ ఆర్య భారతీయ జనతా పార్టీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు కావడంతో రాజకీయ దుమారం కూడా రేగింది. ఈ కేసులో పులకిత్ సహా ముగ్గురు నిందితులకు నార్కో పరీక్షలను చేయబోతున్నారు. ఈ కేసులో పులకిత్ ఆర్యాతోపాటు అతని స్నేహితులు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని దర్యాప్తు బృందం కోర్టులో దరఖాస్తు చేసింది. కోర్టు నుంచి అనుమతి వచ్చిన వెంటనే వీరికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నార్కో పరీక్షల అనంతరమే దర్యాప్తు బృందం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. సాక్ష్యాధారాలను పటిష్టం చేసేందుకు, నిందితులను కఠినంగా శిక్షించేందుకు నార్కో పరీక్షలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
 
రిషికేష్ సమీపంలో పులకిత్ ఆర్య నడుపుతున్న రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకిత భండారీ సెప్టెంబర్ 18న అదృశ్యమైంది. వ్యభిచారం చేయడానికి నిరాకరించడంతో అంకితాను హత్య చేసి రిషికేష్ సమీపంలోని చిల్లా కాలువలో తొలుత ఆమె తప్పిపోయిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 24న అంకిత మృతదేహం లభ్యం అయ్యింది. ఈ కేసులో పులకిత్ పేరు రావడంతో అతని తండ్రి వినోద్ ఆర్యాను బీజేపీ నుంచి బహిష్కరించారు. ఆ రిసార్టును కూడా అధికారులు అక్రమ కట్టడంగా ప్రకటించి కూల్చివేశారు. సాక్ష్యాలను మాయం చేయడానికే ఇలా చేశారంటూ అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

More Telugu News