జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. చేసేదేమీ లేదు: కవిత
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు
- మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారన్న కవిత
- ఎన్నికల సమయంలో మోదీ కంటే ఈడీ ముందొస్తుందని విమర్శ
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రావడానికి ఒక ఏడాది ముందు ఆ రాష్ట్రానికి మోదీ కంటే ముందు ఈడీ వెళ్తుండటాన్ని మనం గమనిస్తున్నామని కవిత చెప్పారు. మోదీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతాయని అన్నారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి... మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని చెప్పారు.
తన మీద కానీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని... వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని అన్నారు. జైల్లో పెడతామంటే ఇక చేసేదేముందని... పెట్టుకో అని కవిత అన్నారు. భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు. మీడియాకు ముందే లీకులిస్తూ అలజడి రేపాలనుకుంటున్నారని మండిపడ్డారు.