YS Sharmila: శంకరం తండా వద్ద ఉద్రిక్తత... వైఎస్ షర్మిల అరెస్ట్

  • గులాబీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించిన షర్మిల వ్యాఖ్యలు 
  • షర్మిల కాన్వాయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
  • పోలీసులతో వైఎస్సార్ తెలంగాణ శ్రేణుల వాగ్వాదం
  • టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగమన్న షర్మిల 
Police arrests YS Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకరం తండా వద్ద షర్మిల కాన్వాయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడంతో, వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు గులాబీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఫ్లెక్సీలను చించివేశారు. షర్మిల కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని ధ్వంసం చేశారు. దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

దీనిపై షర్మిల స్పందిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలో భాగంగానే పాదయాత్రలో బస్సును తగలబెట్టారని ఆరోపించారు. అన్ని అనుమతులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నానని, శాంతిభద్రతల సమస్యను చూపించి తనను అరెస్ట్ చేయాలని, తద్వారా పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను పనోళ్లలాగా వాడుకుంటున్నారని షర్మిల విమర్శించారు. 

More Telugu News