నలుగురిని చంపిన చిరుత ఇక జీవితాంతం బోనులోనే!
- బోనులోనే బంధించి ఉంచనున్న అధికారులు
- రక్తం రుచి మరిగిన పులి.. వదిలితే ప్రమాదమేనని వ్యాఖ్య
- ఉత్తరప్రదేశ్ లో నలుగురు గార్డులపై దాడి చేసిన చిరుత
ఈ ఏడాది ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 20 వరకు గోలా తహసీల్ పరిధిలో నలుగురు గార్డులు చిరుత దాడిలో చనిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. గోలా అటవీ పరిధిలో దాదాపు 25 సీసీ కెమెరాలు బిగించి చిరుత కదలికలను గమనించారు. ఫారెస్టు గార్డులపై దాడి చేసిన చిరుత ఆనవాళ్లతో పోల్చుకుని, దాడికి పాల్పడిన చిరుతను గుర్తించారు. ఆపై ఆరు చోట్ల బోనులతో ట్రాప్ చేయగా.. సోమవారం చిరుత చిక్కిందని తెలిపారు.
లఖీంపూర్ ఖేరీ డివిజన్ అటవీ అధికారి సంజయ్ బిశ్వాల్ మాట్లాడుతూ.. బోనులో చిక్కిన చిరుత పూర్తి ఆరోగ్యంగా, దృఢంగా ఉందని చెప్పారు. సాధారణంగా గాయపడిన చిరుతలు వేటాడేందుకు ఓపిక లేక మనుషులపై దాడి చేస్తాయని చెప్పారు. కానీ ఈ చిరుత మాత్రం రక్తం రుచి మరిగి మనుషులపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. దీంతో బతికున్నంత వరకూ ఈ చిరుతను బోనులోనే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.