వైసీపీ-బీజేపీ బంధం విడదీయలేనిది: సీపీఐ నారాయణ

CPI Narayana Criticized YSRCP
  • బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాయన్న నారాయణ
  • జగన్ మాత్రం స్వాగతించారని విమర్శించిన నేత
  • గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసిన వైనం
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం స్వాగతించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. దీనిని బట్టి బీజేపీ-వైసీపీ మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆ రెండు పార్టీల మధ్య బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. నిన్న తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలను గవర్నర్ల వ్యవస్థ ద్వారా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన నారాయణ.. తక్షణమే ఆ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రైవేటు విమానాలపై నియంత్రణ, నిఘా లేకపోవడం వల్ల వాటి ద్వారా కోట్లాది రూపాయల అక్రమ సొమ్మును రవాణా చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో రూ. 700 కోట్లు వినియోగించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా నారాయణ నిప్పులు చెరిగారు. దేశంలో టెర్రరిజాన్ని నియంత్రించలేని వ్యక్తి అంతర్జాతీయ సదస్సులో టెర్రరిజం గురించి మాట్లాడడం సిగ్గుచేటని, జాతికి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
CPI Narayana
Andhra Pradesh
CPI

More Telugu News