Revanth Reddy: ఆ జాతి రత్నాలను ఎక్కడ కొట్టుకొచ్చావు కేసీఆర్?: రేవంత్ రెడ్డి

  • రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందన
  • సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు
  • కేసీఆర్ దిగజారిపోయాడంటూ వ్యాఖ్యలు
Revanth Reddy take a swipe at KCR

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత దాదాపు మౌనం పాటించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణను కలుషితం చేస్తున్నాయని, అందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపాయని వ్యాఖ్యానించారు. 

తమను ప్రలోభపెట్టారని చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు సత్యహరిశ్చంద్రుడి వారసులు అని ఎద్దేవా చేశారు. అన్ని చోట్ల కెమెరాలు పెట్టి వాళ్లను పట్టివ్వాలని కేసీఆర్ చెప్పాడంట... వీళ్లు పట్టించారంట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఆ ఎమ్మెల్యేలను మునుగోడు తీసుకెళ్లి జాతిరత్నాలు, ప్రజాస్వామ్య రక్షకులు అని కేసీఆర్ చెబుతుండడం చూస్తే ఆయనకు మతి తప్పిందేమోనన్న సందేహాలు కలుగుతున్నాయని అన్నారు. 

"కేసీఆర్... ఈ జాతి రత్నాలు ఎక్కడివి? ఎక్కడ కొట్టుకొచ్చావు వీటిని? ఇక్కడ (కాంగ్రెస్) గెలిచి అక్కడ అమ్ముడుపోయారు వాళ్లు. అమ్ముడుపోయినవాళ్లు అలాగే ఉంటారా? వాళ్లను నమ్మి నువ్వు రాజకీయం చేస్తున్నావా? కొనుగోలుపై వాళ్లు చెప్పగానే కేసీఆర్ కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? కేసీఆర్ ఇంత దిగజారిపోయాడా అనిపిస్తోంది" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News