Gujarat: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఒవైసీకి నిరసన సెగ

  • సూరత్ లో ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్
  • నల్లజెండాలు, మోదీ మోదీ నినాదాలతో యువకుల నిరసన
  • అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో పోటీలో ఎంఐఎం
Owaisi greeted with Modi Modi chants and black flags Gujarat

వచ్చే నెలలో జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీకి ప్రతిపక్షాల నుంచిగట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షానికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ నెల‌‌కొంది. కాంగ్రెస్, ఆప్ తో పాటు ఏఐఎంఐఎమ్ కూడా పలు స్థానాల్లో పోటీ పడుతోంది. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల కోసం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆయన ప్రచారానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఒవైసీకి  నల్లజెండాలు, ‘మోదీ మోదీ’ నినాదాలతో స్వాగతం పలుకుతున్నారు. సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ఒవైసీ నగరానికి వచ్చారు. 

ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వారిష్‌ పఠాన్‌తో కలిసి ఆయన ప్రసంగించారు. అయితే, ఆయన వేదికపైకి రాగానే కొందరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో నినాదాలు చేయడం ప్రారంభించారు. ఒవైసీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లజెండాలు ప్రదర్శించారు. ఆయన ప్రసంగానికి పలుమార్లు అడ్డు తగిలారు. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న చిన్న పార్టీలలో ఎంఐఎం ఒకటి. మైనారిటీల ప్రాబల్యం ఉన్న కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన పార్టీ మరి కొంతమంది అభ్యర్థులను బరిలోకి దించే అవకాశం ఉంది. కాగా, వచ్చే నెల 1, 5వ తేదీల్లో గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడుతాయి.   

More Telugu News