Pakistan: సారీ బ్రదర్... దీన్నే కర్మ అని పిలుస్తారు: పాక్ ఓటమిపై టీమిండియా పేసర్ స్పందన

  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాక్ ఓటమి
  • అభిమానులకు గుండెకోత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన షోయబ్ అక్తర్
  • బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో ట్వీట్ చేసిన వైనం
  • స్పందించిన మహ్మద్ షమీ
Team India bowler reacts to Pakistan defeat in T20 World Cup final

ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు నెల రోజుల పాటు అలరించిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీ ముగిసింది. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు కప్ ను గెలుచుకుంది. కప్ సాధించాలన్న పాకిస్థాన్ ఆశలపై ఇంగ్లండ్ నీళ్లు చల్లింది. 

ఈ ఓటమితో పాక్ క్రికెట్ అభిమానులు బరువెక్కిన హృదయాలతో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని వీడారు. ఇవాళ ఫైనల్ మ్యాచ్ కు 80 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో అత్యధికులు పాక్ జాతీయులే. మ్యాచ్ ముగిసిన పది నిమిషాల్లోనే స్టేడియం నుంచి పాక్ అభిమానులందరూ నిష్క్రమించగా, కేవలం ఇంగ్లండ్ అభిమానులే మిగిలారు. 

ఇక, ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ గుండె పగిలిందన్న భావనను బ్రోకెన్ హార్ట్ ఎమోజీ ద్వారా వెల్లడించాడు. కాగా, అక్తర్ ట్వీట్ పై టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. 

"సారీ బ్రదర్... దీన్నే కర్మ అని పిలుస్తారు" అంటూ పాక్ ఓటమి పట్ల సానుభూతి ప్రదర్శించాడు. తాను కూడా బ్రోకెన్ హార్ట్ ఎమోజీలతో బదులిచ్చాడు.

More Telugu News