Varla Ramaiah: సీఎం గారూ, మీ తెలివి అమోఘం... ప్రధానికి అర్థంకాకుండా రాష్ట్ర సమస్యలన్నీ తెలుగులో ప్రస్తావించారు: వర్ల రామయ్య

  • విశాఖ సభలో సీఎం జగన్ ప్రసంగం
  • మోదీని ప్రసన్నం చేసుకున్నారంటూ వార్ల వ్యాఖ్యలు
  • మీ శల్య సారథ్యం రాష్ట్రానికి వరం అంటూ వ్యంగ్యం 
Varla Ramaiah opines on CM Jagan speech

ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన విశాఖ సభలో సీఎం జగన్ ప్రసంగంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. 

"ముఖ్యమంత్రి గారూ, మీ తెలివి అమోఘం... ప్రధానమంత్రికి అర్థంకాకుండా రాష్ట్ర సమస్యలన్నీ తెలుగులో ప్రస్తావించారు. ఆయనను యథావిధిగా ప్రసన్నం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మాత్రం, సమస్యలన్నీ ఏకరవుపెట్టినట్టు బిల్డప్ ఇచ్చి తూతూ మంత్రంగా ఉభయతారకంగా మాట్లాడిన మీ శల్య సారథ్యం రాష్ట్రానికో వరం" అంటూ వర్ల రామయ్య వ్యంగ్యం ప్రదర్శించారు. 

అంతకుముందు, విశాఖ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల కిందటే ఏపీకి తగిలిన గాయం ఇంకా మానలేదని అన్నారు. రాష్ట్ర గాయాలు మానేలా, జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర పునర్ నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో అజెండా లేదు... మీతో అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతం అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

More Telugu News