పిల్లలకు బండి ఇస్తే మీరే జైలుకెళ్తారు.. కొత్త ట్రాఫిక్ రూల్స్!
- ఇతరులకు వాహనం ఇచ్చినా మీకే ఇబ్బంది
- భారీగా జరిమానా.. అదనంగా జైలు శిక్షకూ అవకాశం
- ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు
మైనర్లు వాహనం నడపడం ప్రమాదాలకు దారితీస్తుందనే ఉద్దేశంతో దీనిపై ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. వాహనం నడుపుతూ మైనర్లు పట్టుబడితే సదరు వాహనదారుడికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. ఈ మొత్తాన్ని 15 రోజుల్లో కట్టాల్సిందే! పట్టుబడ్డ ఆ మైనర్ కు పాతికేళ్లు వచ్చేదాకా దేశంలో ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. మైనర్ వాహనం నడుపుతూ యాక్సిడెంట్ చేస్తే మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. వాహనం యజమానికీ జరిమానా, మూడేళ్ల జైలు విధించే అవకాశం కూడా ఉంది. అందుకే పిల్లలు పెరిగి, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునేదాకా బండి, కారు ఇచ్చి బయటకు పంపొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.