Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు... ఈడీ కస్టడీకి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు

cbi special court allows ed to takes custodyof sharath chandra reddy for 7 days
  • అరబిందో కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న శరత్ చంద్రారెడ్డి
  • మద్యం వ్యాపారి వినయ్ బాబుతో కలిసి శరత్ చంద్రారెడ్డి అరెస్ట్
  • నిందితులను 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ అధికారులు
  • వారం పాటు ఈడీ కస్టడీకి అనుమతించిన సీబీఐ ప్రత్యేక కోర్టు
దేశ రాజకీయాల్లో పెను కలకలం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తెలుగు నేలకు చెందిన ఫార్మా దిగ్గజం అరబిందో కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శరత్ చంద్రారెడ్డితో పాటు మద్యం వ్యాపారి వినయ్ బాబును కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ గురువారం ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు (సీబీఐ ప్రత్యేక కోర్టు)లో హాజరు పరచిన సంగతి తెలిసిందే.

శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా... అదే సమయంలో నిందితులిద్దరినీ తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వీరిద్దరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందన్న ఈడీ అధికారులు... వారిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. ఈడీ అధికారుల వాదనకు సానుకూలంగా స్పందించిన కోర్టు... నిందితులిద్దరినీ వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Delhi Liquor Scam
Enforcement Directorate
CBI
Sharth Chandra Reddy
Arabindo
YSRCP
Vijay Sai Reddy

More Telugu News